
ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని ఓ అనాథకు అంత్యక్రియలు నిర్వహించి, తన సేవాభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)కు చెందిన ప్రాంత కార్యకారిణి సదస్యులు కాకాణి పృథ్వీరాజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల రెండోతేదీన జరిగిన వివరాలు ఆయన మాటల్లోనే..
ఈ రోజు(మే 2) మా నాన్న గారి ఆబ్దికము కార్యక్రమము ముగిసిన తర్వాత శ్రీ కృష్ణ హెగ్డే అనే ఒక సైంటిస్టుకు అమెరికా, ఓహోయో, డేటన్లో అంత్య క్రియలు చేశాను. కృష్ణ హెగ్డే కర్ణాటకకు చెందిన వ్యక్తి . 1978 డేటన్ స్థిరపడ్డాడు. 71 సంవత్సరాలు. బ్రహ్మ చారి, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇద్దరు చెల్లెళ్ళు మైసూర్లో ఉంటారు. ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో అమెరికాలోని హిందూ స్వయంసేవక సంఘని సంప్రదించారు. మా మూడో కుమారుడు శ్రీరాం ఇక్కడ డేటన్ శాఖా ముఖ్య శిక్షక్ కనుక శ్రీరాంని అడిగారు. వాళ్ళు ఒక వారం రోజులుగా ఈ పని చేసే వారి కోసం వెతుకుతున్నారుట. ఫేస్ బుక్లో కూడా వేశారట. ఈ విషయం తెలిసిన వెంటనే నేను అంత్యక్రియలు చేయటానికి ఒప్పుకున్నాను. అది కూడా ఈరోజే అయింది. నాన్న గారి కార్యక్రమం పూర్తి చేసుకుని అంత్యక్రియలు జరిపి వచ్చాను. మా అబ్బాయి శ్రీరాం తోడుగా ఉన్నాడు.






