
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ లాహోర్ పర్యటనకు సరైన కవరేజీ ఇవ్వడంలో విఫలమైనందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్(పీటీవీ).. 17 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది.
కొత్తగా ఎన్నికైన ప్రధాని షరీఫ్ ఏప్రిల్ 24న లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలు, రంజాన్ బజార్లను సందర్శించారు. అయితే, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్(ఎఫ్టీపీ) ద్వారా సంబంధిత వీడియో ఫుటేజీని అప్లోడ్ చేయడానికి అవసరమైన అధునాతన ల్యాప్టాప్ అందుబాటులో లేనందున.. పీటీవీ బృందం సరైన కవరేజీని అందించలేకపోయిందని ఓ వార్తాసంస్థ పేర్కొంది.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం.. రిపోర్టర్లు, ప్రొడ్యూసర్లతో కూడిన బృందం ప్రధానమంత్రి కవరేజీకి బాధ్యత వహిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్, సకాలంలో వీడియో ఫుటేజీల అప్లోడ్ కోసం వారి వద్ద ల్యాప్టాప్లు, ఇతర గాడ్జెట్లు ఉంటాయి. కానీ, పీటీవీ లాహోర్ కేంద్రంలోని సిబ్బంది వద్ద అధునాతన ల్యాప్టాప్ లేకపోయింది.
Source: EtvBharat





