
న్యూఢిల్లీ: ప్రపంచంపై నవ భారత్ తనదైన ముద్ర వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాల విషయంలో సిక్కు జాతి బలమైన పాత్ర పోషిస్తోందని ఉద్ఘాటించారు.
దిల్లీలోని తన నివాసంలో శుక్రవారం ఆయన సిక్కు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఎర్ర తలపాగా ధరించి ప్రత్యేకంగా కనిపించారు. ఈ భేటీలో ప్రధాని మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటం, ఆ తర్వాత స్వతంత్ర భారత్ ప్రస్థానంలో సిక్కులు అందించిన సేవలకు యావద్దేశం కృతజ్ఞతాభావంతో ఉందని చెప్పారు.
సిక్కు గురువులు ప్రజల్లో స్ఫూర్తి నింపారని, ‘ఒకే భారత్, శ్రేష్ఠ భారత్’ అన్నదానికి సిక్కు సంప్రదాయాలు సజీవ నిదర్శనంగా నిలుస్తున్నాయని మోదీ కొనియాడారు. కరోనా సమయంలో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు.
‘మహమ్మారి ఆరంభంలో పాత ఆలోచనాధోరణితో ఉన్నవారు భారత్ సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతమంది జనాభాకు టీకాలను ఎలా సమకూర్చగలదు? ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలదు? అని సందేహించారు. కానీ, ఇప్పుడు భారత్ అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా ఎదిగింది’ అని మోదీ చెప్పారు.





