
-
తేల్చి చెప్పిన యూజీసీ, ఐఏసీటీఈ
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో చేసిన డిగ్రీలు ఇక్కడ చెల్లవ్, వాటితో ఉద్యోగాలూ రావని యూజీసీ, ఐఏసీటీఈ తేల్చి చెప్పాయి. పాకిస్తాన్లో భారత విద్యార్థులు డిగ్రీలు, ఇతర ఉన్నత చదువులు అభ్యసించవద్దని సలహా ఇచ్చాయి.
అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేసిన కోర్సులు భారత్లో చెల్లుబాటు కావని విద్యార్థులకు స్పష్టం చేశాయి. ఉన్నత చదువుల కోసం ఎవరూ పాకిస్తాన్కు వెళ్ళొద్దని వెల్లడించాయి. పాకిస్తాన్లో చదువుకున్న విద్యార్హతలతో భారత్లో ఉద్యోగం చేయడానికి, ఉన్నత చదువులు చదవడానికి అనర్హులు అవుతారని పేర్కొన్నాయి.

పాకిస్తాన్కు వలస వెళ్ళిన వారు, వారి పిల్లలు భారత పౌరసత్వం కలిగి ఉన్నవారి డిగ్రీలు.. కేంద్ర హోం శాఖ భద్రతాపరమైన అనుమతితో పరిగణిస్తామని సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. పాకిస్తాన్లో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య తక్కువే ఉంటున్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా యూజీసీ, ఐఏసీటీఈ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Source: EtvBharat





