
-
ఆర్టికల్ 370 రద్దు అనంతరం తొలిసారి పర్యటించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్ర సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగైదు ఏళ్ళలో జమ్మూకశ్మీర్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ నెలలో కశ్మీరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం భద్రత, ఇతర సంసిద్ధతను సమీక్షించడానికి కశ్మీర్ వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గందరగోళం నుంచి జమ్మూకశ్మీర్ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.
‘‘మేం కశ్మీర్ ప్రాంతంలో గ్రామీణాభివృద్ధిలో కొత్త ఆవిష్కరణలు చేస్తామని, వ్యవసాయ స్టార్టప్లను ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. కశ్మీరులో రూ. 2.45 కోట్ల విలువైన సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసే పని రెండు రోజుల్లో పూర్తవుతుందని, దీని ద్వారా ఏప్రిల్ 18 వతేదీ నాటికి 340 గృహాలకు సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. కాగా, 2019 ఆగస్టులో కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.





