
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు ఆహార నిల్వలను అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కోరుకుంటే వెంటనే సరఫరాలు ప్రారంభిస్తామని వివరించారు. యుద్ధం కారణంగా పలు దేశాల వద్ద ఆహారనిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో తానీ ప్రతిపాదన చేసినట్టు మోదీ చెప్పారు. గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలోని అదలాజ్ వద్ద శ్రీ అన్నపూర్ణ ధామ్ ట్రస్టు నిర్మించిన బాలుర వసతిగృహం, విద్యాసముదాయాలను వర్చువల్గా ప్రధాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్తో వర్చువల్గా తాను జరిపిన భేటీ వివరాలను ఆయన పంచుకున్నారు. ఆహార ఉత్పత్తులు మొదలు, ఇంధనాలు, నూనెలు, ఎరువులు.. ఇలా కోరుకున్న ఏదీ దొరకని పరిస్థితి నేడు మిగతా దేశాల్లో ఉన్నదని వివరించారు. వ్యవసాయ కులానికి చెందిన పటీదార్లలోని ఉప కులం అయిన లేవా పటేళ్ల సేవలను ఆయన కొనియాడారు.





