
కడప: యావత్ దేశమంతా సీతారాముల కల్యాణం నవమిరోజు పట్టపగలు జరిగితే ఏపీలోని ఒంటిమిట్టలో మాత్రం చతుర్ధశి రోజున పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీ. దాన్ని కొనసాగిస్తూ రాత్రి ఎనిమిది నుంచి 10 గంటల వరకూ కోదండరాముడి కల్యాణం నిర్వహించేందుకు వేదపండితులు ముహూర్తం నిర్ణయించారు.
పురాణాలు, చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీరాముడు.. చంద్రుడికి ఇచ్చిన వరం వల్ల ఇక్కడ రాత్రివేళ కల్యాణోత్సవం జరిపిస్తున్నట్టు ఆర్చకులు తెలిపారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు ఆమగశాస్త్రం ప్రకారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కాగా, రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట అంగరంగవైభవంగా ముస్తాబైంది. అశేష భక్త జనుల సమక్షంలో కల్యాణం కమనీయంగా సాగనుంది.
రెండేళ్ళ దర్శన భాగ్యం..
కరోనా కారణంగా రెండేళ్ళ ఏకాంతంగా స్వామివారి కల్యాణం నిర్వహించిన టీటీడీ ఈసారి మాత్రం 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక ప్రాంగణంలో వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో భక్తులకు కల్యాణ దర్శన భాగ్యం కలగనుంది. సుమారు 50 నుంచి 60 వేలమంది భక్తులు ప్రత్యక్షంగా కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు మంచినీరు, భోజనాలు సిద్ధం చేసింది.
రాకపోకలపై ఆంక్షలు
కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల కోసం కౌంటర్లు అందుబాటులోకి తెచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కడప-రేణిగుంట ప్రధాన జాతీయ రహదారిలో ఒంటిమిట్ట ఉండటంతో ఈ మార్గంలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి 16వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్ రాకపోకలపై విధించారు.
Source: EtvBharat





