తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల పదోతేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 11న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఏప్రిల్ 11న సోమవారం సాయంత్రం అయిదు గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.