
బెంగళూరు: పరీక్షల విధులకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని, ఎవరైనా హిజాబ్ ధరిస్తే పరీక్ష హాలులోకి అనుమతి ఉండదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇకపోతే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎస్ఎల్సీ) పరీక్ష ముగిసే వరకు విద్యార్థులకు తప్పనిసరిగా యూనిఫాం ఉండాలంటూ మార్చి 25న కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయమై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. విద్యా సంస్థల్లో విద్యార్థులకు యూనిఫాం తప్పనిసరి. ఇదే నిబంధన టీచర్లకు కూడా వర్తిస్తుంది. పదవ తరగతి పరీక్ష హాలులోకి హిజాబ్ ధరించిన టీచర్లకు అనుమతి లేదు. ఇది 12 తరగతి వరకు నిర్వహించే పరీక్షలకు కూడా వర్తిస్తుంది. హిజాబ్పై మేం టీచర్లను బలవంతం చేయడం లేదు. నచ్చనివాళ్లు పరీక్ష డ్యూటీని వదులుకుంటారు’’ అని అన్నారు.





