
ప్రధాని నరేంద్రమోడీని హతమారుస్తామని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు ఈ-మెయిల్లో పంపించాడు. అలాగే దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మెయిల్లో పేర్కొన్నాడు. ఎన్ఐఏ ముంబయి బ్రాంచ్ కు ఈ తరహా ఈ-మెయిల్ అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ప్రధాని మోడీని హత్య చేసేందుకు 20 మంది స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నారని ఈ – మెయిల్లో ఆగంతుకుడు పేర్కొన్నాడు. వారి వద్ద 20 కేజీల ఆర్డీఎక్స్ ఉందని పేర్కొన్నాడు. దీని ద్వారా దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నామని, వివిధ ఉగ్రవాద గ్రూపులు దీనికోసం పనిచేస్తున్నాయని ఈ – మెయిల్లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. తమకు వచ్చిన ఈ -మెయిల్ ను ఎన్ఐఏ వివిధ ఏజెన్సీలతో పంచుకుంది. మరోవైపు ఈ-మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది.





