
కడప: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 15న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కల్యాణం రోజున వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, మంచినీరు, మజ్జిగ అందించేందుకు చక్కటి ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని విభాగాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని కల్యాణం రోజున భక్తులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాలని, అవసరమైన చోట్ల చలువపందిళ్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఊరేగింపు నిర్వహించే వాహనాలు, రథానికి సంబంధించిన పటిష్టతను పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు.





