
642views
రాజమహేంద్రవరం: మావోయిస్టు మడకం ఇడుమమ్మ అలియాస్ ఇడిమి అలియాస్ లత తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 2016లో సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరిన ఇడుమమ్మ.. శబరి ఎల్వోఎస్లో దళ సభ్యురాలిగా చేరారు. సంవత్సరం తర్వాత చర్ల ఎల్వోఎస్కు బదిలీ అయ్యారు.
నాలుగేళ్ళు అక్కడ పనిచేసి తిరిగి శబరి ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్గా ఏడాది పాటు పనిచేశారు. మావోయిస్టు పార్టీ విధానాలు, గుత్తి కోయలపై ఆదివాసీయేతర వివక్ష నచ్చక జన జీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్టు గుత్తికోయ తెగకు చెందిన ఇడుమమ్మ వెల్లడించారు. ఈమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పేగ పంచాయతీ పరిధిలోని పుంగుట్ట.





