
-
వెల్లడించిన వరల్డ్ లైన్ నివేదిక
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు మనదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్టు ‘వరల్డ్లైన్ ఇండియా’ డిజిటల్ పేమెంట్స్ నివేదిక విశ్లేషించింది. దీని ప్రకారం గత ఏడాదిలో మనదేశంలో చెలామణిలో ఉన్న డెబిట్/ క్రెడిట్ కార్డుల సంఖ్య 100 కోట్లకు మించిపోయింది. ఇందులో డెబిట్ కార్డులు 93 కోట్లు, క్రెడిట్ కార్డులు దాదాపు 7 కోట్ల మేరకు ఉన్నాయి. క్రెడిట్ కార్డుల మార్కెట్లో ప్రైవేటు బ్యాంకుల వాటా 67 శాతం ఉంటే, ప్రభుత్వ బ్యాంకుల వాటా 24 శాతం కనిపిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్ చెల్లింపులకు వినియోగదార్లు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా వరల్డ్లైన్ సౌత్ ఏషియా ఎండీ దీపక్ చంద్నాని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న కార్డులు, యూపీఐ సదుపాయాలకు తోడు భారత్ బిల్పే, ఎన్ఈటీసీ ఫాస్ట్ ట్యాగ్ తదితర నూతన చెల్లింపు సాధనాలు సైతం అందుబాటులోకి వస్తున్నందున డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడిందని విశ్లేషించారు.





