News

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం

430views

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్‌ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని నేటి నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అనంతరం ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు దంచే వేడుకను వైభవంగా చేపట్టారు. అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆలయంలోని బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఏప్రిల్‌ 9న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్త బృందాలు విశేష సంఖ్యలో తరలివచ్చి గోటి తలంబ్రాలను అందించి మొక్కులు తీర్చుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.