
512views
-
30 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్ నౌకాదళ సిబ్బంది
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారత్కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను పాక్ తీర గస్తీ దళాలు సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, వీరంతా గుజరాత్లోని పోరుబందర్ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు.
అయితే, గత 25 రోజుల వ్యవధిలో 20 పడవలు, 120 మంది భారత జాలర్లను పాక్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారత జాలర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆధీనంలో 1200 పడవలు, 500 మందికి పైగా జాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పడవలను జనవరి 31వ తేదీన బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఈ క్రమంలో ఓ పాక్ పౌరుడితో అదుపులోకి తీసుకుని, మూడు బోట్లను స్వాధీనం చేసుకున్నాయి.





