News

హిజాబ్‌కు ఇస్లాంలో అంత ప్రాధాన్యం లేదు

478views
  • హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క స‌ర్కార్‌

బెంగ‌ళూరుః హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల పరిధిలోకి రాదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా హిజాబ్‌ను ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) పరిధిలోకి వస్తుందని కూడా భావించడం లేదని చెప్పింది.

శబరిమల, షాయరా బానో కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా హిజాబ్ ఆచారం రాజ్యాంగపరమైన నైతికత, వ్యక్తిగత గౌరవ, మర్యాదల పరీక్షలో గెలవడం తప్పనిసరి అని తెలిపింది. ఈ వివాదంపై వరుసగా ఆరో రోజు విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఓ ప్రశ్న అడిగింది.

ప్రశాంతతను దెబ్బతీసే వస్త్రాలను అనుమతించేది లేదని ఈ నెల అయిదోతేదీన‌ ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్న సహేతుకత ఏమిటని అడిగింది. అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఉడుపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో ఈ వివాదం ప్రారంభమైందని పేర్కొన్నారు.

ఈ కళాశాలలో చాలా కాలం నుంచి యూనిఫాం అమలవుతోందని చెబుతూ 2021 డిసెంబరు వరకు యూనిఫాం ధరించడంలో విద్యార్థినుల నుంచి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాలేదని గుర్తు చేశారు. తమకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు విద్యార్థినులు ఈ కళాశాల ప్రిన్సిపల్‌ను కోరడంతో, ఈ విజ్ఞప్తిని కళాశాల అభివృద్ధి కమిటీ పరిశీలించిందని చెప్పారు.

2022 జనవరి ఒక‌టోతేదీన‌ ఈ కమిటీ సమావేశం జరిగినట్టు తెలిపారు. 1985 నుంచి యూనిఫాం అమలవుతోందని, విద్యార్థినులు యూనిఫాంను ధరిస్తున్నారని, దీనిని మార్చకూడదని ఈ కమిటీ నిర్ణయించిందని చెప్పారు.

హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరిన విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా ఈ సమావేశానికి పిలిచారని, 1985 నుంచి యూనిఫాం అమలవుతున్న విషయాన్ని వారికి చెప్పారని తెలిపారు. అయితే, విద్యార్థినులు నిరసనలను ప్రారంభించడంతో ఈ సమావేశం వల్ల ఉపయోగం లేకపోయిందని చెప్పారు. ఈ సమస్య సున్నితత్వం గురించి ప్రభుత్వానికి సమాచారం తెలిసిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని వివరించారు.

హిజాబ్‌ లేదా కాషాయ తలపాగా ధరించిన విద్యార్థులపై నిషేధం విధిస్తూ ఈ నెల అయిదోతేదీన‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని 25వ అధికరణను ధిక్కరిస్తున్నాయని కొందరు ముస్లిం యువతులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేశారు. అడ్వకేట్‌ జనరల్‌ వారి వాదనను తోసిపుచ్చారు.

25వ అధికరణ భారత పౌరులకు మతాన్ని ప్రచారం చేసుకోవడం, ఆచరించడం, వృత్తి స్వేచ్ఛను కల్పిస్తోంది. తమ ఉత్తర్వులు రాజ్యాంగంలోని19(1)(ఎ) అధికరణను కూడా ఉల్లంఘించడం లేదని నవద్గి స్పష్టం చేశారు. 19(1)(ఎ) అధికరణ పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోంది. చట్టానికి అనుగుణంగానే తాము ఉత్తర్వులు జారీ చేశామని, ఇందులో అభ్యంతరం వ్యక్తం చేయాల్సిందేమీ లేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

మరోవంక, కళాశాలలోకి ప్రవేశించాలంటే, హిజాబ్ తీసేయాలని కోరడంతో కర్ణాటకలోని ఇంగ్లీషు ప్రొఫెసర్ రాజీనామా నిర్ణయం తీసుకుంది. తుమకూరులోని జైన్ పియూ కాలేజ్‌లో చాందినీ మూడేళ్ళుగా ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. హిజాబ్‌ను తీసేయాలని ఆమెను తొలిసారి కోరడంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది.

“నేను గత మూడేళ్ళుగా జైన్ పియూ కాలేజ్‌లో పనిచేస్తున్నాను. ఇంత వరకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. అయితే ప్రిన్సిపాల్ నిన్న(గురువారం) బోధించేప్పుడు హిజాబ్ లేక ఎలాంటి ఇతర మతపరమైన చిహ్నాలు ధరించకూడదని అన్నారు. కానీ, నేను గత మూడేళ్ళుగా హిజాబ్ ధరించే బోధిస్తూ వచ్చాను. ఈ కొత్త నిర్ణయం నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. అందుకనే నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను” అని చాందినీ విలేఖ‌రులకు చెప్పింది. అయితే, కాలేజ్ ప్రిన్సిపాల్ కెటి మంజునాథ్ మాత్రం తాను గానీ, మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇతరులు కానీ ఆమెను హిజాబ్ తీసేయమని చెప్పనేలేదని స్పష్టం చేశారు.

Source:Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి