
525views
అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. పవిత్ర గోదావరి సాగర సంగమ క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి కల్యాణ మహోత్సవం నయన మనోహరంగా సాగింది. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఉత్సవమూర్తుల్ని కల్యాణ మండపంలో ప్రతిష్ఠింపజేశారు. పరిణయ వేడుకల్లో ఒక్కో ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
విశ్వక్సేన ఆరాధన, కన్యాదానం, పుణ్యాహవచనం, మాంగళ్యధారణ, తలంబ్రాలు.. ఇలా వివాహ క్రతువుల్ని కన్నుల పండువగా నిర్వహించారు. సరిగ్గా 12 గంటల 25 నిమిషాల సుమూహర్తంలో స్వామి అమ్మవార్లపై పురోహితులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వేణుగోపాలకృష్ణ దంపతులు పట్టువస్త్రాలు అందించారు.





