News

హిజాబ్‌ ముసుగులో జిహాదీ అరాచకాలు!

508views
  • వీహెచ్‌పీ కేంద్ర జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ సురేంద్ర జైన్‌

న్యూఢల్లీ: కర్ణాటక ఉడిపిలో మొదలైన హిజాబ్‌.. వాస్తవానికి హిజాబ్‌ కాద‌ని, దాని ముసుగులో జిహాదీ అరాచకాలను సృష్టించడానికి ఒక ఎత్తుగడ అని విశ్వహిందూ పరిషత్‌(విహెచ్‌పి) మండిపడింది. ఈ మేరకు వీహెచ్‌పీ కేంద్ర జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ సురేంద్ర జైన్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విద్యాలయాల్లో జరుగుతున్నది హిజాబ్‌ కాదని దీనిని ‘హిజాబ్‌ జిహాద్‌’ అని పిలుస్తారని అన్నారు.

ఉడిపిలోని ఒక పాఠశాలలో యూనిఫాం వాడకూడదని ఆరుగురు విద్యార్థినులు రభస చేయడం దేశంలో ఫ్లాష్‌ పాయింట్‌గా మారిందన్నారు. ఈ వ్యవహారంతో మొత్తం కర్ణాటకలో అల్లకల్లోలం సృష్టించేందుకు పీఎఫ్‌ఐ వంటి జిహాదీ సంస్థలు పెద్ద కుట్ర పన్నుతున్నాయని సురేంద్ర జైన్‌ హెచ్చరించారు. బాగల్‌కోట్‌ వంటి పలు ప్రాంతాల్లో జిహాదీలు జరిపిన రాళ్ళదాడి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. హిందూ సమాజంతోపాటు దేశంలోని ఇతర పౌరులు అప్రమత్తమై జిహాదీ ఎజెండాను విజయవంతం చేయనివ్వడం లేద‌న్నారు.

ఇస్లామిక్‌ ప్రపంచంతోపాటు ప్రపంచంలోని టూల్‌కిట్‌ గ్యాంగ్‌లు దీనిపై స్పందించిన తీరు చూస్తుంటే, భారత్‌లో గందరగోళం సృష్టించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్టు అర్థమవుతుందని జైన్ అన్నారు. బహుశా వారు కర్ణాటకలో కూడా షాహీన్‌బాగ్‌ని పునరావృతం చేయాలని పథకం రచించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం పటిష్ఠమైన నిఘా, దేశంలోని జాతీయవాద సమాజం ఎల్లవేళలా దేశభక్తితో అప్రమత్తంగా ఉండడంతో వారి ఆటలు చెల్లడం లేదని అన్నారు. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి పరోక్ష మద్దతు ఇవ్వడం వల్లనే దేశద్రోహులు ఢిల్లీ పౌరులను ఇబ్బంది పెట్టగలిగారన్నారు.

ఉడిపికి చెందిన ఆ విద్యార్థినులు ఈ వ్యవహారానికి తమకు తాము నమ్మిన బంట్లు అని అనుకుంటున్నారని జైన్‌ అన్నారు. పాఠశాల యూనిఫాం వేసుకుని తరగతులకు హాజరుకావడం, విద్యార్థి నియమాలు, మార్గదర్శకాలను అనుసరించడం, విద్యను అభ్యసించడం, గురువులు విద్య అందించడం వంటి వాటి వల్ల పాఠశాలలో గొప్ప స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు.

మొదట్లో ఈ విద్యార్థినులు యూనిఫాం ధరించి పాఠశాలకు వచ్చేవారు… హఠాత్తుగా హిజాబ్‌ ధరించడం… ఈ దురభిమానంపై దూకుడుగా వ్యవహరించిన తీరు చూస్తుంటే, ఇది ఘజ్వా-ఎ-హింద్‌ జిహాదీ పథకంలో భాగమేనని స్పష్టమవుతుందన్నారు. దీనిని సమర్ధించడమే కాకుండా, కాంగ్రెస్‌ పార్టీ సూత్రధారి అయిన టూల్‌కిట్‌ గ్యాంగ్‌ హిందూ సమాజాన్ని అవమానపరిచిన తీరు ఆమోదయోగ్యం కాదని, అత్యంత ఖండించదగినదని జైన్‌ అన్నారు.

ఖాళీగా ఉన్న స్తంభంపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయడం.. జాతీయ జెండాను అవమానించడమేనంటూ కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌ తప్పుగా చిత్రీకరించారని, ఈ ఎత్తులన్నీ అధికార దాహంతో చేస్తున్నవేనని జైన్‌ విమర్శించారు.

హిందువులను అవమానించేలా జిహాదీ మంటలను రెచ్చగొట్టే ఇటువంటి నేరాలు తన సూచనల మేరకే జరుగుతున్నాయా? లేదా? అన్న సంగతిని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేయాలి! లేని పక్షంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుని కాంగ్రెస్‌కు మచ్చ లేకుండా చేసే ప్రయత్నం చేయాలని జైన్‌ హితవు పలికారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని మొత్తం టూల్‌కిట్‌ ముఠాలు, జిహాదీ శక్తులు దేశంలో అధర్మాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని జైన్‌ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం జిహాదీ కుట్రలన్నింటిని బయటపెట్టి, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని వీహెచ్‌పీ విజ్ఞప్తి చేస్తోందన్నారు.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి