
భాగ్యనగరం: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయలకు నెలవైన సమ్మక్క సారలమ్మ మహా జాతరకు.. రెండు వారాల ముందు నుంచి గుడిమెలిగే, మండమెలిగే పండగలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గత బుధవారం గుడిమెలిగే పండగను జరిపి జాతరకు అంకురార్పణ చేసిన పూజారులు.. బుధవారం మండమెలిగే ఘనంగా నిర్వహించారు.
ఇవాళ వేకువజామునే.. గద్దెలను కడిగి పూజలు చేసి ముగ్గులు వేసిన పూజారులు.. డోలు వాయిద్యాలు హోరెత్తుండగా.. పసుపు కుంకుమలతో ఊరేగింపు చేపట్టారు. మేడారం గ్రామం చుట్టూ.. దిష్టి తోరణాలు కట్టారు.
ఇలా చేస్తే దుష్టశక్తులు తమ గ్రామాల్లోకి రావని వీరి విశ్వాసం. రాత్రి గద్దెల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి జాగారాలు చేయనున్నారు. ఇందుకోసం రాత్రి సమయంలో దర్శనాలను నిలిపివేయనున్నారు. వచ్చే బుధవారం సాయంత్రం.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురావడంతో.. మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమవనుంది.





