
కెనడా: కెనడా/అమెరికా సరిహద్దు సమీపంలోని మానిటోబాలో ఈ నెల 19న మంచుతుపానులో చిక్కుకుని సజీవసమాధి అయిన నలుగురు సభ్యులతో కూడిన ఒక భారతీయ కుటుంబ ఆచూకీని కెనడా ప్రభుత్వం నిర్ధారించినట్టు ఇక్కడి భారతీయ హైకమిషన్ తెలిపింది.
జగదీశ్ కుటుంబం స్వస్థలం గుజరాత్లోని గాంధీనగర్ జిల్లా కలోల్ తహశీల్లోని దింగుచా గ్రామంగా తెలిసింది. ఈ గ్రామం నుంచి చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు అధికారిక పత్రాలతో వెళ్లి విదేశాల్లో సెటిలవగా మరికొందరు టూరిస్టు వీసా మీద వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విదేశాల్లో జీవించడం ఈ గ్రామంలో గౌరవంగా పరిగణిస్తారు. విదేశాల్లో బంధువులు లేకపోతే ఇక్కడ పెళ్లి సంబంధలు కూడా దొరకడం కష్టమనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతోంది.
ఆ గ్రామంలో ఉన్న అందిరిలాగే తాను కూడా కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడాలని జగదీశ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గ్రామంలో తనకున్న 12 ఎకరాల పొలాన్ని విడిచి ఇంట్లో పెద్దలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా జనవరి 12న కుటుంబంతో సహా కెనాడా ఫ్లైట్ ఎక్కారు.
అక్కడ తెలిసిన వారి సాయంతో అనధికారికంగా అమెరికాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జనవరి 19న స్థానిక ఏజెంట్ల సాయంతో కెనడాలోని మానిటోబా దగ్గర సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. సరిహద్దులో ఉండే అధికారుల కళ్ల బడకుండా ఉండేందుకు ప్రధాన రహదారి, వాహనాలను విడిచి, కాలి నడకన సరిహద్దు దాటేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
జగదీశ్ కుటుంబం సరిహద్దు దాటే క్రమంలో మైనస్ 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంచు విపరీతంగా కురవడంతో పాటు తీవ్రమైన గాలులు వీయడం మొదలైంది. ఈ ప్రతికూల వాతావరణానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడంలో జగదీశ్ కుటుంబం విఫలమైంది.
మరోవైపు సరిహద్దు దాటించేందుకు సాయం చేస్తానన్నా ట్రావెల్ ఏజెంట్లు గస్తీ ఎక్కువగా కావడంతో మార్గమధ్యంలోనే వారిని వదిలేశారు. ఈ విపత్కర పరిస్థితిలో చలికి తట్టుకోలేక అమెరికా సరిహద్దులకు సమీపంలో కెనెడా వైపు వీరు ఊపిరి వదిలారు.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





