
భాగ్యనగరం: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. కాగా, ఈ ఏడాది సుమారు కోటి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో అమ్మవారి గద్దెల వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉండేది. కానీ, ప్రభుత్వం దానిని తొలగించి వీఐపీ మార్గంగా మార్చింది.
ప్రత్యేక దర్శనం ఉన్నప్పుడు దాని నుంచి కొంత ఆదాయం వచ్చేది. అది ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేది. ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించాలని సమ్మక్క-సారలమ్మ ప్రధాన పూజారి జగ్గారావు కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థంతో పాటు ఆలయానికి ఆదాయం వస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను.. 17న సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.
Source: EtvBharat





