
-
మిగిలిన వారినీ విడుదల చేయాలని భారత్ డిమాండ్
న్యూఢిల్లీ: నాలుగేళ్ళుగా పాకిస్థాన్ జైల్లో మగ్గి విడుదలైన 20 మంది మత్స్యకారులు భారత్ చేరుకున్నారు. గుజరాత్లోని గిర్ సోమ్నాథ్ జిల్లా వేరవల్ పోర్టుకు చేరుకున్న జాలర్లు తమ కుటుంబ సభ్యులను కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో 15 మంది గిర్ సోమ్నాథ్ జిల్లా వాసులు కాగా… మరో ఐదుగురు ఉత్తర్ప్రదేశ్కు చెందిన వారున్నారు.
పాకిస్థాన్ జైళ్ళలో 560 మందికి పైగా మత్స్యకారులున్నారని, 1,148 కి పైగా పడవలు వారి అధీనంలో ఉన్నాయని వారు పేర్కొన్నారు. వారందరినీ విడిపించేందుకు భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, న్యాయసంబంధ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక అధికారులు వారిని కుటుంబ సభ్యులతో కలిసి స్వస్థలాలకు పంపించారు.
జైళ్లలో ఉన్న కొంత మంది భారతీయులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అక్కడ సరైన వసతులు లేవని తెలిపారు. అన్నం, కనీస సౌకర్యాలు కూడా వారికి అందించడం లేదని తెలిపారు. వారికి ఎలాంటి అనారోగ్యానికి గురైనా ఒకే రకమైన మందులు ఇస్తారని వెల్లడించారు. దీంతో మత్స్యకారులంతా తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు.





