-
కొవిడ్ సమయంలో కేంద్రం దీటైన చర్యలు
-
అంతర్జాతీయ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: మరో పదేళ్ళలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. వచ్చే ఏడాది ఫ్రాన్స్ను అధిగమించి, ఆరో స్థానంలో భారత్ నిలుస్తుందని ది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. లండన్ కేంద్రంగా పనిచేసే ఈ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన వార్షిక నివేదిక ‘వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ ప్రకారం..
2021లో భారత్ ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది మళ్లీ ఫ్రాన్స్ను అధిగమించి ఆరో స్థానానికి చేరుతుంది. 2023లో బ్రిటన్ కంటే భారత ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లి, అయిదో స్థానానికి చేరొచ్చని నివేదిక అంచనా వేసింది. కొవిడ్ పరిణామాలతో గతేడాది ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడినా, అమెరికా, బ్రెజిల్ తరవాత దేశీయంగా అధికంగా మరణాలు నమోదైనా, ప్రభుత్వం అత్యవసరంగా తీసుకున్న చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకుందని పేర్కొంది. అందువల్ల 2020లో జీడీపీ 7.3 శాతం క్షీణతను నమోదు చేసినా, 2021లో 8.5 శాతం వృద్ధి చెందే వీలుందని తెలిపింది.