
-
ఢిల్లీలో ఆజాదీ కా అమృతోత్సవ్ రెండో సమావేశం
-
దేశవ్యాప్తంగా పాల్గొన్న ప్రముఖులు
న్యూఢిల్లీ: మహనీయుల త్యాగాలు దేశ భవిష్యత్కు మార్గదర్శకాలని, కరోనాతో కకావికలమైన ప్రపంచం తిరిగి కోలుకునే క్రమంలో మనం కీలక భూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మరుపురాని ఘట్టంగా నిర్వహించడం కోసం అవసరమైన ప్రణాళిక రూపకల్పనకు ప్రధాని నేతృత్వంలో ఏర్పాటైన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జాతీయ కమిటీ రెండో సమావేశం బుధవారం దిల్లీలో నిర్వహించారు.
ఈ భేటీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, జి.కిషన్రెడ్డిలతోపాటు అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్రావు, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, మరికొందరు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. స్వాతంత్య్రం కోసం ఎందరో వీరులు చేసిన త్యాగాలను ప్రస్తుత తరానికి తెలియజెప్పి వారిలో స్ఫూర్తి నింపే విధంగా కార్యక్రమాలను రూపొందించడంపై ఇందులో చర్చించారు.





