
న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై మాజీ ప్రధాని దేవేగౌడ ప్రశంసలు కురిపించారు. బీజేపీ 276 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని.. పొత్తుతోనే బీజేపీ అధికారంలోకి రావొచ్చు.. కానీ సొంతంగా 276 స్థానాలు గెలవదని తాను గతంలో అన్న మాటలను గుర్తు చేసుకున్నారు.
ఒకవేళ గెలిస్తే తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఓ ప్రకటన కూడా చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి సొంతంగానే అధికారం చేపట్టడం వల్ల తన సవాల్ నిలబెట్టుకోవాలని భావించినట్టు దేవె గౌడ వెల్లడించారు.
గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని మోదీ ఆహ్వానించారని.. వేడుకలు ముగిసిన తర్వాత మోదీతో వ్యక్తిగతంగా కలిసి రాజీనామా చేస్తానని అన్నట్టు గౌడ తెలిపారు. అయితే “ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలను ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? అవసరమైనప్పుడల్లా మీతో చర్చించాల్సి వస్తుంది.” అని మోదీ బదులిచ్చినట్టు గౌడ వెల్లడించారు.
ఈ సంఘటన తర్వాత మోదీని ఆరేడు సార్లు కలిశానని, మోదీ పై గౌరవం మరింత పెరుగుతూ వస్తోందని గౌడ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రిగా ఎదిగే క్రమంలో మోదీలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. దీంతో మోదీపై తన అభిప్రాయం కూడా మారిందన్నారు.





