
-
ఉత్తరాంధ్రలో రెడ్ అలర్ట్
విశాఖపట్నం: జవాద్ తుపాను దూసుకొస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలానికి, చేపలకంచేరు, పార్వతీపురం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గజపతినగరం మండలంలో 161 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
విశాఖపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విశాఖ కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 0891-2590100, 2590102, 2750089, 2750090, 2560820కు ఫోన్ చేయాలని సూచించారు. జీవీఎంసీ, రెవెన్యూ, జలవనరుల శాఖ సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మల్లికార్జున సూచించారు.
ఇదిలావుండగా, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో కూడా అక్కడి అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను కారణంగా 95కు పైగా రైళ్ళు రద్దు అయ్యాయి. కాగా, శ్రీకాకుళం జిల్లాలో నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నాగావళి, వంశధార నదులకు వరద సూచన జారీ చేశారు. నదీపరివాహక, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి కలెక్టర్ హెచ్చరించారు.
Source: Etv





