
ఎన్ సి బి ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్ దేవ్ కచ్రూజీ వాంఖడే మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత నవాబ్ మాలిక్ పై పరువు నష్టం కేసు వేశారు. రూ.1.25 కోట్ల నష్టపరిహారం కోరుతూ బొంబాయి హైకోర్టులో కేసు దాఖలైంది. నవాబ్ మాలిక్ సూచనల మేరకే తమ కుటుంబం గురించి ప్రచురించడం, వ్రాయడం చేస్తున్నారని, వాటిపై శాశ్వత నిషేధాన్ని కోరుకుంటున్నట్లు పిటిషన్ లో కోరారు.
ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని తన కుమార్తె, క్రిమినల్ లాయర్ అయిన యాస్మిన్ ప్రాక్టీస్ ను నాశనం చేయడంతో పాటు మహారాష్ట్ర మంత్రి తన కుటుంబసభ్యుల కీర్తి ప్రతిష్టతలకు పూడ్చలేని నష్టం, హాని కలిగిస్తున్నారని, భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసు నుండి ఇటీవల ఎన్ సి బి తొలగించిన సమీర్ వాంఖడేపై నవాబ్ మాలిక్ వరుస ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ ప్రమేయం ఉన్న కేసులో కూడా సమీర్ ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్ సి బి అధికారిగా ఉద్యోగం పొందేందుకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని ఆరోపించారు.
సాక్ష్యాలుంటే కోర్టుకు వెళ్లండి
మరోవంక, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన తాజా ఆరోపణలపై ఎన్ సీ బీ అధికారులు స్పందించారు. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాలుంటే ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని వారు ప్రశ్నించారు.





