
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇటీవలే న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న యువకుడికి ధర్మాసనం పాఠం చెప్పింది. పదాలకు అర్థాలు వివరిస్తూ ప్రోత్సహించింది. ముందు కేసు సారాంశాన్ని తెలుసుకోవాలని, లేకుంటే కోర్టులో న్యాయవాది.. మైదానంలో బ్యాట్లేని సచిన్ టెండూల్కర్లా ఉంటాడని వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడం వల్ల కేసు విచారణను కాసేపు వాయిదా వేయాలని కోరిన ఆ యువ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. సీనియర్లు రానప్పుడు వాదించడానికి సిద్ధంగా ఉండాలని హితవు చెప్పింది.
ఈ మాటలు విన్న జూనియర్ లాయర్.. పన్నుల వ్యవహారానికి సంబంధించిన కేసు సారాంశాన్ని వినిపించడం ప్రారంభించారు. మధ్యలో కొన్ని పదాలకు ధర్మాసనం అర్థాలు అడిగింది. ‘కాగ్నెంట్’ అన్న పదానికి అర్థం చెప్పలేకపోవడంతో సెల్ తీసుకొని గూగుల్లో వెతకాలని సూచించింది. దీనికి హేతుబద్ధం, ఒప్పించండం వంటి అర్థాలు ఉన్నాయని ధర్మాసనమే చెప్పింది.
మధ్యమధ్యలో ‘మర్చంట్ ట్రేడ్ ట్యాక్సేషన్’, ‘ఎంటీటీ’ అన్న పదాలకు అర్థాలు చెప్పింది. ‘బెంచ్’కు ‘ప్రిన్సిపల్ సీటు’కు మధ్య తేడా ఏమిటని అడిగింది. మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధిలోని జబల్పుర్ బెంచ్…ప్రిన్సిపల్ సీటు అవుతుందా? కాదా? అని అడిగింది. భోజనానికి వెళ్తున్నామని, ఈ లోగా కేసును చదివి సిద్ధం కావాలని సూచించింది. భోజన విరామం అనంతరం ఈ జూనియర్ లాయర్ సహకరించగా, సీనియర్ న్యాయవాది వచ్చి వాదనలు వినిపించారు.





