
వాషింగ్టన్: అమెరికా బలగాలు మరోసారి తమ ప్రతాపాన్ని చూపాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా సీనియర్ నాయకుడిని డ్రోన్ దాడితో అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో అల్ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్ హమీద్ అల్ మతార్ హతమయ్యాడని అమెరికా ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ వెల్లడించారు. దీంతో అమెరికా పౌరులు, తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అల్-ఖైదా సీనియర్ నాయకుడిని హతమార్చడం ద్వారా ఉగ్ర సంస్థలు మరింతగా కుట్ర పన్నేందుకు, ప్రపంచ దాడులకు పాల్పడే సామర్థ్యం దెబ్బతింటుందని అన్నారు.
ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల్లోనే డ్రోన్ దాడి
కాగా, దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్పోస్ట్పై ఉగ్రవాదులు దాడి జరిపిన రెండు రోజుల్లోనే ఈ డ్రోన్ దాడి జరిగడం గమనార్హం. అయితే ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందా? లేదా అనే విషయాన్ని అమెరికా ప్రకటించలేదు. కాగా, సెప్టెంబర్ చివరిలో పెంటగాన్ వాయువ్య ప్రాంతంలో ఇడ్లిబ్ సమీపంలో వైమానిక దాడిలో సిరియాలోని మరొక సీనియర్ అల్-ఖైదా కమాండర్ సలీం అబూ-అహ్మద్ను హతమార్చింది.
Source: Tv9





