
-
ఎన్సీబీ అధికారుల విచారణలో నటి అనన్యా పాండే
ముంబై: డ్రగ్స్ కేసుకు సంబంధించి అనుమానితులను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. బాలీవుడ్ నటి అనన్యా పాండే వరుసగా రెండో రోజు విచారణకు హాజరైంది. రెండు రోజుల కిందట షారుక్ నివాసం ‘మన్నత్’లో సోదాలు నిర్వహించారు. అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం ఆమెను సుదీర్ఘంగా విచారణ చేయగా.. శుక్రవారం కూడా విచారణకు రావాలని పిలిచారు.
శుక్రవారం ఆమెను ఎన్సీబీ అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనన్య-ఆర్యన్ ఖాన్కు డ్రగ్స్ అందించినట్టు గతంలో ఓ వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడైందని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. తాను ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని అనన్య పేర్కొంది. గంజాయి గురించి అడిగిన ఆర్యన్తో కేవలం తాను జోక్ చేశానని, అంతే తప్ప డ్రగ్స్ గురించి తనకేమీ తెలియదని అధికారులకు స్పష్టం చేసింది.
గంజాయి కోసం ఆర్యన్ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్టు ఆ చాట్లో ఉందని.. ఈ చాట్ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్ చేశానని అనన్య చెప్పినట్టు మీడియాలో వచ్చాయి. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్టు తెలిసింది. ఆమె నుంచి ఇంకా సమాచారం సేకరించాలని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు సోమవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు.
Source: NationalistHub





