
-
ఆవు పేడతో గణపతి విగ్రహాల తయారీ
-
భోపాల్ యువతి వినూత్న ఆలోచన
భోపాల్: గోమాత సకల దేవతలకు ఆలవాలం. గోవు పంచకం, గోమయం లేనిదే హిందువులు పూజలు చేయరు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఆవు తాజాగా, ఓ యువతికి ప్రశంసలు తెప్పిస్తోంది. అంతేకాదు… సమృద్ధిగా ఉపాధి కల్పిస్తోంది. వినాయక చవితికి రసాయనాలతో చేసిన విగ్రహాలు వినియోగిస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని భావించిన ఓ మహిళ… తన వినూత్న ఆలోచనను కార్యరూపంలో పెట్టింది.
మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన కాంత యాదవ్ అనే మహిళ ఆవు పేడతో వినాయక విగ్రహాలు తయారు చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆవు పేడతో విగ్రహాలు తయారు చేయడం సులభమని, కేవలం 15 నిమిషాల్లో ఆకర్షణీయమైన విగ్రహం స్వయంగా తయారు చేయొచ్చనని చెబుతోంది. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని నాలుగు రోజుల పాటు ఆర పెడితే సరిపోతుందని తెలిపింది.
తయారీ విధానం
విగ్రహం తయారు చేసే విధానాన్ని కాంత యాదవ్ మాటల్లో… ‘ఆవు పేడ ఎండిన తర్వాత అందులో కొంత చెక్క పొట్టు, మైదా పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, దాని నుండి విగ్రహాన్ని తయారు చేయాలి. విగ్రహానికి ప్రకృతి నుంచి లభించిన సహజ రంగులను ఉపయోగిస్తే మరింత ఆనందంగా ఉంటుంది. హిందూ సంస్కృతిలో ఆవు పేడను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే మేము ఆవు పేడతో విగ్రహాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నాము’అని చెప్పారామె…
ఢిల్లీ నుంచి ఆర్డర్లు
తాము తయారు చేసిన విగ్రహాలకు స్థానికంగానే కాకుండా పూణే, ఢల్లీితోపాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఆర్డర్లు వస్తాయని కాంత యాదవ్ తెలిపారు. భక్తులు ఈ విగ్రహాలను కొనుగోలు చేయడానికి పోటీపడుతున్నారని, ఇంకా… వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని ఉందని అడుగుతున్నారని చెప్పారామె. అయితే, అలా నేర్చుకోవాలని ఇష్టంగా ఉన్నవారికి తాము శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంత యాదవ్ తెలిపారు.
Source: Tv9, ANI





