
విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిపై విధించిన నిబంధనలు వెనక్కి తీసుకొనేలా, హిందువుల మనోభావాలను గౌరవించేలా, ఎప్పటివలే గణేష్ పూజలను రాష్ట్రంలో ఘనంగా జరుకొనేందుకు సహకారం అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సద్బుద్ది ప్రసాదించాలని హిందూ సంఘాలు ఘంటానాదం చేస్తూ, ఆ భగవంతుని ప్రార్థించాయి.

విశ్వహిందూ పిలుపు మేరకు గురువారం స్థానిక చినబజార్ రాణాప్రతాప్ కూడలిలోని వినాయక చవితి నిర్వహణా మండపం వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిముషాల పాటు భక్తులు ఘంటానాదం చేశారు. ఈ ఘంటానాదం ద్వారా పాలకులకు ఆ గణపతి మంచిబుద్ది ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే, ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అసంపూర్తిగా వచ్చిన తీర్పునకు నిరసన వ్యక్తంచేశారు.

గతంలోలా రాష్ట్రవ్యాప్తంగా చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుకొనేలా రాష్ట్ర సర్కారు కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు బయ్యా వాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి శ్రీకాంత్, రాణాప్రతాప్ కూడలి గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.





