
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరిహద్దులలో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘన్ నుంచి వస్తున్న వాహనాల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్ లోని అట్టారీ సరిహద్దుల్లో.. దేశంలోనే తొలిసారిగా ‘రేడియేషన్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ (ఆర్డీఈ)’ స్కానర్ ను మోహరించింది. ట్రక్కులు, లారీల వంటి వాహనాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రేడియోధార్మిక పదార్థాలను ఎక్స్ రే కిరణాల సహాయంతో ఈ స్కానర్ పసిగడుతుంది.
నిజానికి భారత్-పాక్ మధ్య వాణిజ్య కార్యకలాపాలు కొన్నాళ్లుగా నిలిచిపోయాయి. అయితే అఫ్గాన్ ట్రక్కులు, లారీలు పాక్ మీదుగా అట్టారీ సరిహద్దు నుంచి మన దేశంలోకి ప్రయాణిస్తున్నాయి. సగటున రోజుకు 30 ట్రక్కుల్లో ఎండు ఫలాలు, ఇతర పండ్లు అఫ్గానిస్థాన్ నుంచి భారత్ చేరుకుంటున్నాయి. ఈ వాహనాలన్నింటినీ ఆర్డీఈతో స్కాన్ చేస్తున్నారు. త్వరలోనే మరో ఏడు సరిహద్దు కేంద్రాల్లోనూ ఈ స్కానర్ను మోహరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.





