
తాలిబన్లు ఉగ్రవాదులని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తేల్చి చెప్పారు. వారిని తాము అలానే గుర్తిస్తామన్నారు. తాలిబన్లపై ఆర్థిక ఆంక్షలకు తాను అనుకూలమని ట్రూడో పేర్కొన్నారు. త్వరలోనే జీ-7 వర్చువల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. తాలిబన్ల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు ఈ జీ7 సమావేశం జరగనుంది. ”త్వరలో జీ7 భేటీ జరగనుంది. దానిలో అఫ్గానిస్థాన్కు తాము మరింత మెరుగ్గా ఏమి చేయగలమో చర్చించి.. వాటిని అమలు చేస్తాం” అని ట్రూడో పేర్కొన్నట్లు ది గ్లోబ్ అండ్ మెయిల్ పేర్కొంది.
అఫ్గాన్లో విధించిన తుది గడువు పొడిగించమని ఈ జీ7 భేటీలో కోరే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్లు ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. వీలైనంత ఎక్కువ మందిని అఫ్గానిస్థాన్ దాటించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారని స్కైన్యూస్ పేర్కొంది.
ఇప్పటికే బలగాలు, ఉద్యోగులు, శరణార్థుల తరలింపు కార్యక్రమం తీవ్ర గందరగోళంగా మారింది. ఇప్పటికే దేశం వీడేందుకు భారీ సంఖ్యలో ప్రజలు కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. దీంతో నిత్యం అక్కడి నుంచి ఏదో ఒక దుర్వార్త వస్తూనే ఉంది. సంకీర్ణ సేనలు ఇప్పటి వరకు 28 వేల మందిని అఫ్గానిస్థాన్ నుంచి కాపాడినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ తరలింపు కార్యక్రమం పొడిగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు. దీనికోసం బైడెన్ కొందరు నేతలతో చర్చించారు. ఇప్పటికే అక్కడ ఆరు వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు.
ఆఫ్గన్ కు ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ నిధుల నిలిపివేత
ఆఫ్ఘానిస్తాన్ కు నిధుల సాయాన్ని ప్రపంచ బ్యాంకు నిలిపివేసింది. ఆ దేశంలోని మహిళల హక్కులపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని ఈ బ్యాంకు అధికారి తెలిపారు. ఆఫ్ఘన్ దేశానికి ఇక సాయం చెయ్యబోము..అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం అని ఆయన చెప్పారు. పైగా అంతర్జాతీయ దేశాలతోనూ, భాగస్వాములతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని..ఆఫ్ఘన్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఆఫ్ఘన్ అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు రెండు డజన్ల ప్రాజెక్టులను చేపట్టింది. 2002 నుంచి 5.3 బిలియన్ డాలర్లను ఈ దేశ ప్రగతికి వ్యయం చేసింది. ఈ నిధుల్లో చాలావరకు గ్రాంట్ల రూపంలో లభించింది. గత శుక్రవారం నాటికే కాబూల్ లోని తమ సిబ్బందినంతటినీ వరల్డ్ బ్యాంకు తరలించింది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి తన నిధులను ఆపివేసినట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ సాయంలో 370 మిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం కూడా ఉందని, ఇదిగాక.. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద సోమవారానికి మరో 340 మిలియన్ డాలర్ల సాయాన్ని కూడా నిలిపివేశామని పేర్కొన్నాయి.





