News

విశ్వ క్రీడల్లో మెరిసిన భారత హాకీ జట్టు – 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కాంస్య పతకం

494views

టోక్యో జరుగుతున్న ఒలింపిక్స్ ‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది. జర్మనీపై 5- 4తో విజయాన్ని సాధించింది. ఆరంభంలో భారత హాకీ జట్టు కాస్త తడబడినా… ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా ఆడింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌లు ఎక్కువగా నమోదు కావడం విశేషం. మ్యాచ్ ఆరంభంలో రెండో నిమిషానికి ప్రత్యర్ధి జర్మనీ జట్టు గోల్ వేయగా.. భారత్ తడబడినట్లు కనిపించింది. రెండో క్వార్టర్ తర్వాత భారత్ పుంజుకుంది. సిమ్రాన్‌జిత్ గోల్ కొట్టడంతో స్కోర్ 1-1తో సమం అయింది. అటు మూడో క్వార్టర్‌లో భారత్, జర్మనీ అమీతుమీ తెల్చుకున్నాయి. మొదట జర్మనీ రెండు గోల్స్ వేయగా, ఆ తర్వాత పెనాల్టీ కార్నర్‌లు అందిపుచ్చుకుని భారత్ హాఫ్ టైం ముగిసేసరికి 3-3తో స్కోర్ సమం చేసింది.

ఇక మూడో క్వార్టర్‌లో భారత్ పూర్తిగా పైచేయి సాధించింది. ఆరంభంలో ఒక గోల్.. ఆ వెంటనే మరో గోల్ సాధించి 5-3తో ఆధిక్యం సాధించింది. జర్మనీపై ఒత్తిడి పెంచింది. ఆపై ప్రత్యర్ధికి మరో గోల్ దక్కకుండా డిఫెన్స్ మోడ్‌లో కి వెళ్లి గేమ్ ‌ను ముగింపుకు తీసుకొచ్చింది. ఇక చివర్లో జర్మనీ గోల్ చేయడంతో స్కోర్ 4-5 కాగా.. అక్కడ నుంచి మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగింది. ఆఖర్లో జర్మనీ షూట్ అవుట్ పెనాల్టీని అడ్డుకోవడంతో భారత్ అపూర్వ విజయాన్ని అందుకుంది.

హాకీ జట్టుకు ప్రధాని ప్రశంసలు..

ఒలింపిక్స్ ‌లో చరిత్ర సృష్టించిన హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. కాంస్య పతకాన్ని దేశానికి తీసుకొస్తున్న జట్టుకు అభినందనలు తెలిపారు. భారతీయుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేశారంటూ కొనియాడారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని.. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.