ఒలింపిక్స్ విజేత మీరాబాయికి భారత రైల్వే సత్కారం.. రెండు కోట్ల ఆర్థిక సహాయం.. ప్రచారకర్తగా నియామకం..

టోక్యో ఒలింపిక్స్ లో రజతం గెలుచుకున్న మీరాబాయి చాను సోమవారం భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా భారతీయ రైల్వే ఘనంగా సన్మానించి, బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, మీరాబాయి చాను దేశానికి గర్వకారణమైందని, తమ ఉద్యోగి ఒలింపిక్స్లో పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే రైల్వే నుంచి రూ. 2 కోట్లతో పాటు ప్రమోషన్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. తన ప్రతిభ, కృషితో కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అంతకుముందు మీరాబాయి చానును క్రీడా మంత్రిత్వ శాఖ కూడా సత్కరించింది. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్, మాజీ క్రీడా మంత్రి కిరెన్ రిజిజు, సర్బానంద సోనోవాల్, జి. కృష్ణారెడ్డితోపాటు ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. టోక్యోలో విజయం సాధించినందుకు సహాయం చేసిన క్రీడా మంత్రిత్వ శాఖకు, ప్రధాని నరేంద్ర మోడీకి మీరాబాయి చాను ధన్యవాదాలు తెలియజేశారు. ఈమేరకు ఆమె మాట్లాడుతూ, ‘ప్రధాని మోడీకి, క్రీడా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా తక్కువ సమయంలో నన్ను ప్రాక్టీస్ కోసం అమెరికాకు పంపించారు. ఒక్క రోజులోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాంతో నాకు మంచి శిక్షణ లభించింది. అలాంటి కఠిన శిక్షణతోనే నేను పతకం సాధించానని’ ఆమె తెలిపింది. రజత పతక విజేత మీరాబాయి చానును మణిపూర్ రాష్ట్ర పోలీసు విభాగంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్గా నియమిస్తామని మణిపూర్ సీఎం ఎన్. బిరెన్ సింగ్ సోమవారం ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపునుంచి కోటి రూపాయల బహుమతిని కూడా అందిస్తుందని సీఎం తెలిపారు.





