
వాట్సాప్లో తప్పుడు పోస్టులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్న ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వాట్సాప్ పేర్కొంది . భారత్లో ఈ సంవత్సరం మే 15 నుంచి జూన్ 15 మధ్య 20 లక్షల అకౌంట్లపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఆ కాల వ్యవధిలో 345 మంది నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా తొలిసారి నెలవారీ కాంప్లియన్స్ నివేదికను వాట్సప్ గురువారం విడుదల చేసింది. హానికరమైన, అనుచిత సందేశాలు పెద్దమొత్తంలో ఎవరూ పంపకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, అలాంటి సందేశాలను అధికంగా పంపిస్తున్న ఖాతాలను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించుకుంటున్నామని వాట్సాప్ తెలిపింది.
ఒక్క భారత్లోనే మే 15 నుంచి జూన్ 15 మధ్య 20 లక్షల ఖాతాలను నిషేధించడం జరిగిందని పేర్కొంది. వాటిలో 95 శాతానికి పైగా ఖాతాలపై.. అధీకృతం కాని ఆటోమేటెడ్/బల్క్(స్పాం) సందేశాలను పంపడం వల్లే ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. డేటా సమీకరణకు తగినంత సమయం అవసరం. 30-45 రోజుల తర్వాత తదుపరి నివేదికను సమర్పిస్తాం అని వాట్సప్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నెలనెలా సగటున దాదాపు 80 లక్షల ఖాతాలను ఆ కంపెనీ నిషేధిస్తుంటుంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. అయితే కొత్తగా ఐటీ నిబంధనల విషయంలో వాట్సాప్ కట్టుబడి ఉందని తెలిపింది. వాట్సాప్లో ఇలాంటి ఇబ్బంది కలిగించే పోస్టులు ఉన్నట్లుటే వారి ఖాతాలను తొలగించడం జరుగుతుందని వాట్సాప్ హెచ్చరించింది.





