
జమ్మూకశ్మీర్లో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. అనంతనాగ్లో నలుగురు, శ్రీనగర్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్న కేసుకు సంబంధించి ఎన్ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్లో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)తో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం ఎన్ఐఏకు సహకరిస్తున్నాయి. శ్రీనగర్, అనంత్నాగ్, బారాముల్లా ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఉగ్రవాద సంస్థల తరఫున పనిచేస్తున్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం శనివారం విధుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఉద్వాసనకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ ఇద్దరు కుమారులతో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరంతా సాధారణ ఉద్యోగులు, ప్రజల్లా తిరుగుతూ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారు. సలాహుద్దీన్ కుమారులు సయ్యద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్లు హిజ్బుల్ ముజాహిదీన్కు హవాలా మార్గంలో నిధులు సమకూర్చుతున్న విషయాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే నేడు సోదాలు చేపట్టారు.





