
కర్నూలు జిల్లా ఆత్మకూరులో 63 మంది వార్డు వాలంటీర్లను తొలగిస్తూ పురపాలక సంఘం కమిషనరు వెంకటదాసు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి రక్షణగా వాలంటీర్లు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆత్మకూరులోని వార్డు వాలంటీర్లలో 63 మంది ఇంకా టీకా వేయించుకోలేదు. కమిషనరుతో పాటు సచివాలయ ఉద్యోగులు హెచ్చరికలు, మెమోలు జారీ చేసినా.. వారు ఆసక్తి చూపించలేదు. ఈ నెల 1న ఆత్మకూరులో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సంయుక్త కలెక్టరు జిలానీ సామూన్ వాలంటీర్ల వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. టీకా వేయించుకోని వారిని విధుల నుంచి తొలగించాలని కమిషనరుకు సూచించారు. ఈ విషయాన్ని ఫోన్లో చెప్పినా వాలంటీర్లు స్పందించకపోవడంవల్లే వారిని తొలగించినట్లు కమిషనరు శనివారం తెలిపారు. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు కొత్త వాలంటీర్ల ఎంపిక కోసం సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు.





