
దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న రుజువులు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఎ.) ఉగ్రకోణం మూలాలను అన్వేషించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకూ హైదరాబాద్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీలో సోదాలు, దర్యాప్తు నిర్వహించిన ఎన్.ఐ.ఎ.అధికారులు ఇకపై హైదరాబాద్ కేంద్రంగా పరిశోధన సాగించనున్నారని తెలిసింది. దీన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు ఎన్.ఐ.ఎ. ఉన్నతాధికారులు హైదరాబాద్ చేరుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆదివారం కీలక అధికారి రానున్నారు. ఇక్కడి నుంచి వారు మాలిక్ సోదరుల కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.
ఐఎస్ఐ లింకులపై ఆరా..
పేలుడులో మల్లేపల్లిలో నివాసముంటున్న నసీర్ఖాన్, ఇమ్రాన్ మాలిక్లు కీలకపాత్ర పోషించారు. మల్లేపల్లిలో 20ఏళ్ల నుంచి మాలిక్ సోదరులుంటున్నారు. వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న వీరికి స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా ఉన్నారా? పాస్పోర్టుల ఆధారంగా ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారన్న అంశాన్ని ఆరా తీయనున్నారు. తప్పుడు వివరాలతో పాస్పోర్టులు పొందారా? అన్నదీ విచారించనున్నారు. పాకిస్థాన్లో ఉంటున్న ఇక్బాల్తో సంబంధాలున్నాయంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకి సంబంధాలున్నాయా? అన్న అంశాన్ని పరిశోధిస్తున్నారు. మాలిక్ సోదరులకు ఉత్తర్ప్రదేశ్లోని శామ్లిజిల్లాకు కైరానాకు చెందిన ఇద్దరు లష్కరేతోయిబా ఉగ్రవాదులు మహ్మద్ సలీమ్, కాఫిల్లు సహకరించారు. వారితో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి పేలుడు పదార్థాలను ఎలా, ఎక్కడికి పంపించాలో ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో మహ్మద్ సలీమ్.. పాకిస్థాన్లో లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడైన ఇక్బాల్తో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఇక్కడికి హవాలా రూపంలో డబ్బు తీసుకువచ్చేవాడని గుర్తించారు.





