
జమ్ముకశ్మీర్లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. కశ్మీర్ విభజన, భౌగోళిక రూపురేఖల మార్పు దిశగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వ్యతిరేకిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో ఇంకా ఎలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదని వ్యాఖ్యానించారు.
జమ్ముకశ్మీర్కు చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24న సమావేశం కానున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ దిశగా కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఖురేషీ.. జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దును పాక్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఈ అంశాన్ని ఐరాస భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.