News

2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా

232views

భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ పరేడ్‌(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్రాన్స్‌ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్వీకరణ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాలను సాధ్యమైనంత తొందరగా వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనుకున్న సమయానికే వాటిని తీసుకొస్తామన్నారు. భారత్‌-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ఇరు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు. వివాదాస్పద ప్రాంతాల్లో ఇరు పక్షాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సరిహద్దులో చైనా బలగాల మోహరింపుపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు.

భారత ప్రభుత్వం 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.59 వేల కోట్లు. కొనుగోలు చేసిన మొత్తం రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2022, ఏప్రిల్‌ నాటికి వాయుసేనకు అప్పగిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఫిబ్రవరిలో తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.