News

భారత్ లో రూ.50 కే అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ – కేంద్రం సంచలన నిర్ణయం

931views

కోవిడ్ కేసులను తగ్గించడానికి నిత్యం లక్షలాది మందికి దేశంలో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లోకి త్వరలో అతితక్కువ ధరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్ కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఇది అన్ని అనుమతులు పొంది మార్కెట్లోకి వస్తే ఇప్పుడున్న అన్ని కరోనా వ్యాక్సిన్లలోకి ఇదే అత్యంత చవకైన వ్యాక్సిన్ కానుందని అధికారులు వెల్లడిస్తున్నారు. కోర్బెవాక్స్ సింగిల్ డోస్ ధరను బయోలాజికల్ ఈ సంస్థ రూ.250గా నిర్ణయించింది. అదే రెండు డోసులు అయితే రూ.400 కే పొందవచ్చు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల పలు విషయాలను వెల్లడించారు. కోర్బెవాక్స్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలను చూపించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కోర్బెవ్యాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వేగవంతంగా జరుగుతున్నాయి.

కాగా.. ఇతర సంస్థల వ్యాక్సిన్లతో పోల్చితే ఈ వ్యాక్సిన్ తక్కువ ధరకు లభించనుంది. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే రేటు రూ.300 కాగా, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 లకు అందిస్తోంది. భారత్ బయోటెక్ తయారుచేసేన కోవ్యాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కి అందిస్తుండగా, దీని ధర ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రూ.1,200గా ఉంది. ఇక, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఒక్క డోసు వెల రూ.995 గా ఉంది. కేంద్రం ఇప్పటికే ముందస్తు ఆర్డర్లు బుక్ చేసినట్లు సమాచారం. ఒక్కో డోసుకు రూ.50 చొప్పున రూ.1,500 కోట్ల వ్యయంతో 30 కోట్ల డోసులు సరఫరా చేయాలని బయోలాజికల్ ఇ సంస్థను కోరిందని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.