
సైనిక దళాల ఆధునికీరణ సంతృప్తికరంగా జరుగుతోందని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే వెల్లడించారు. ఆయన ఆంగ్ల వార్త సంస్థ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతల కారణంగా అత్యవసర ఖర్చుల కోసం భారీగా నిధులు వెచ్చించడం దళాల ఆధునికీరణపై ప్రభావం చూపిస్తుందనే వాదనను ఆయన కొట్టిపారేశారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.21వేల కోట్లు విలువైన 59 కొత్త కాంట్రాక్టులను చేసుకొన్నామన్నారు. మరికొన్ని కాంట్రాక్టులు వివిధ దశల్లో ఉ న్నాయని వెల్లడించారు. ఆర్మీ ఆధునీకరణకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోందని ఆయన తెలిపారు.
”భారత సైన్యం ఆధునికీకరణ సంతృప్తికరంగా జరుగుతోంది. ఇటీవలో రూ.16వేల కోట్లు విలువైన 15 కాంట్రాక్టులను సాధారణ కొనుగోలు విధానంలో పూర్తి చేశాము. మరో రూ.5 వేల కోట్లు విలువైన 44 కాంట్రాక్టులను అత్యవసర కొనుగోళ్ల విధానంలో కొన్నాము” అని పేర్కొన్నారు. లద్దాక్లో మోహరింపుల కారణంగా సైనిక దళాల ఆధునికీకరణ ఏమాత్రం ప్రభావితం కాలేదని వెల్లడించారు.
ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో సైనిక దళాలకు రూ.4.78లక్షల కోట్లు కేటాయించింది. దీనిలో కేవలం రూ. 1,35,060 కోట్లు ఆయుధాలు, విమానాలు, నౌకల కొనుగోళ్లకు సంబంధించిన వాటికి వినియోగించాలి. గతేడాది పోలిస్తే ఈ పద్దుకు కేటాయించిన మొత్తం 18.75శాతం పెరిగింది. చైనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే సైనిక దళాలను వేగంగా ఆధునికీకరించాలని పలు నివేదికలు పేర్కొన్నాయి.





