
ఆక్సిజన్ కొరతతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆసుపత్రులు.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి నుంచి వచ్చిన స్పందనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. రోగి మరణించిన ఎంతకాలానికి తాము స్పందించాలని ప్రశ్నించాయి. ఆక్సిజన్ స్టాక్ ఉన్నప్పటికీ ఆసుపత్రులు అనవసరంగా అత్యవసర పరిస్థితిని లేవనెత్తొద్దంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. ‘ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వ ఉన్నప్పటికీ..కొన్ని ఆసుపత్రులు కొరత ఉందంటూ అత్యవసర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఒక ఆసుపత్రిలో 72 గంటలకు సరిపడా నిల్వ ఉంది, మరో ఆసుపత్రి మూడింట ఒకవంతు మాత్రమే వినియోగించి ప్రభుత్వాన్ని సంప్రదించింది’ అంటూ ఆసుపత్రుల పేర్లు చెప్పకుండా విమర్శించారు.
దీనిపై జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఆసుపత్రులు అనవసరంగా ఆక్సిజన్ కొరతపై ప్రకటనలు చేస్తున్నాయని ఉపముఖ్యమంత్రి అన్నారు. ఆక్సిజన్ లేకుండా ఆసుపత్రులు వేచి ఉండాలా? రోగి చనిపోయాక ఎంతకాలానికి ఆక్సిజన్ కొరతపై ప్రకటన చేయాలి?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవైపు ఢిల్లీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణా లోపమే కారణమని ఆసుపత్రులు నిందిస్తున్నాయి. రోజురోజుకూ ఢిల్లీలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతుండటంతో..ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తిన బాధితులకు ఆక్సిజన్ అందుబాటులోని పరిస్థితి ఎదురవుతోంది. దీనిపై పలు ఆసుపత్రులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.





