
856views
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత్ సేవలు మరువలేనివి అని కొనియాడింది. భారత్ చేసిన ఈ సాయం శాంతి పరిరక్షకులు సురక్షితంగా ఉండేందుకు దోహదపడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ తెలిపారు. భారత్ పంపిన 2 లక్షల కరోనా వ్యాక్సిన్లు శనివారం తెల్లవారుజామున ముంబయి నుంచి బయలుదేరాయి.
విశ్వశాంతికి బలమైన మద్దతుదారు అయిన భారత్.. శాంతి పరిరక్షక సిబ్బందికి ఉదారంగా కరోనా వ్యాక్సిన్లను అందించడాన్ని ఐరాస శాంతి పరిరక్షక దళ ప్రతినిధి జనరల్ జీన్ పియరీ కొనియాడారు. ఐరాస శాంతి పరిరక్షణ దళంలో పనిచేస్తున్న 85,782 మంది సిబ్బందికి భారత్ రూపొందించిన టీకాలను ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 58 మిలియన్లకు పైగా భారత కరోనా వ్యాక్సిన్లు 70 దేశాలకు చేరుకున్నాయి.





