
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గ పోరు ఈసారి ఆసక్తికరంగా మారనుంది. సీఎంకు పోటీగా హత్యాచార బాధితురాళ్ల తల్లి బరిలోకి దిగుతున్నారు. మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వలయార్ అక్కాచెల్లెళ్ల హత్యాచారం కేసులో మృతుల తల్లి.. ధర్మదాంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”నా కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నా. నా కుమార్తెలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా” అని అన్నారు.
ఇదిలా ఉండగా.. ధర్మదాం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. తాజా పరిణామాలపై కేపీసీపీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ మాట్లాడుతూ.. వయనార్ బాధితుల తల్లికి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయం సరైందేనని, ఆమె రాకతో ఎన్నికల వేడి మరింత పెరిగిందని అన్నారు.
2017లో వలయార్ ప్రాంతంలో అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు బాలికపై కొందరు అతిదారుణంగా అత్యాచారం చేసి వారిని చంపేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ స్థానిక కోర్టు ఆ మధ్య తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో కేరళ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. మరోవైపు తమ కుమార్తెలకు న్యాయం చేయాలంటూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న మృతురాళ్ల తల్లి.. జనవరి 26 నుంచి పాలక్కడ్లో సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. గత నెల గుండు గీయించుకుని తన నిరసన వ్యక్తం చేశారు.





