
విమానాశ్రయం తరహాలో సెంట్రలైజ్డ్ ఏసీ కలిగిన దేశంలోనే తొలి రైల్వే టర్మినల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రఖ్యాత సివిల్ ఇంజినీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీద బెంగళూరులో ఏర్పాటైన ఈ టర్మినల్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శనివారం వెల్లడించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆయన తన ట్విటర్లో పోస్ట్ చేశారు.


బెంగళూరులోని బయ్యప్పన్హళ్లిలో ఏర్పాటైన ఈ టర్మినల్ ద్వారా బెంగళూరు నగరానికి మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను అనుసంధానం చేయడం వీలు పడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. సుమారు ₹314 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టర్మినల్ ఫిబ్రవరి నెలాఖరుకే ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమైందని చెప్పారు. ఒకసారి ఇది అందుబాటులోకి వస్తే కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంతపూర్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. మొత్తం 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ టర్మినల్లో రోజూ 50వేల మంది వరకు రాకపోకలు సాగించొచ్చు. మొత్తం ఏడు ప్లాట్ఫాంలు కలిగిన టర్మినల్ ప్రాంగణంలో 250 వరకు కార్లు, 900 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంది. ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టు, ఎస్కలేటర్స్, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండు సబ్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.





