News

మన సహకార ధోరణికి భగవద్గీతే ప్రేరణ

628views

గవద్గీత మనిషిని ఆలోచింపజేసి.. ప్రశ్నించే స్ఫూర్తిని కలిగిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం స్వామి చిద్భవానంద రాసిన భగవద్గీత కిండిల్‌ వెర్షన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ.. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరామకృష్ణ తపోవన్‌ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి చిద్భవానందకు నివాళులు అర్పించారు.

‘భగవద్గీత మనిషిని ఆలోచింపజేస్తుంది. ప్రశ్నించే విధంగా స్ఫూర్తి కలిగిస్తుంది. అంతేకాకుండా చర్చకు ప్రోత్సహిస్తుంది. భగవద్గీత నుంచి స్ఫూర్తిని పొందిన వారు ఎవరైనా కరుణ స్వభావాన్ని కలిగి ఉంటారు. అలా భగవద్గీత బోధించిన మాదిరిగానే… ఇటీవల భారత్‌ ప్రపంచానికి అవసరమైన ఔషధాల్ని భారత్‌ అందించింది. కరోనా నుంచి ప్రపంచం కోలుకునేందుకు మన దేశంలో తయారైన టీకాల్ని అందించి సహాయం చేసింది’ అని మోదీ తెలిపారు.

‘ఆచార్య వినోభా బావే భగవద్గీత తనను ఒడిలో పెట్టుకుని చూసుకునే తల్లిగా అభివర్ణించారు. అదేవిధంగా మహాత్మాగాంధీ, లోక్‌మాన్య తిలక్‌, మహాకవి సుబ్రహ్మణ్య భారతి వంటి వారు సైతం భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినవారే’ అని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ పుస్తకాలకు ఆదరణ పెరిగిన తరుణంలో భగవద్గీతను డిజిటలైజ్‌ చేసే ప్రయత్నాల ద్వారా యువతను దాంతో మరింత ఎక్కువ అనుసంధానం చేయవచ్చని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.