
జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, తదితరుల నుంచి రూ. 11.86 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ జప్తు చేసింది. జమ్ము, శ్రీనగర్లో ఉన్న ఈ ఆస్తులను మనీల్యాండరింగ్ కేసులో తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. జప్తు చేసిన వాటిలో రెండు రెసిడెన్షియల్స్, ఒక వాణిజ్య ఆస్తి, మూడు ప్లాట్లు ఉన్నట్లు వారు తెలిపారు. పత్రాల ప్రకారం వీటి విలువ 11 కోట్ల ఎనభై లక్షలుండగా, మార్కెట్ విలువ దాదాపు రూ.60 నుంచి 70 కోట్లు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో చోటు చేసుకున్న మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును పరిగణనలోకి తీసుకొని ఈడీ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఫరూక్తో పాటు మరో ముగ్గురిపై సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. కాగా బెదిరింపు చర్యల్లో భాగంగానే తన తండ్రిపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ఫరూక్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గతంలో అసహనం వ్యక్తం చేశారు.





